బంటువానివలస అనే గ్రామంలో స్వాతి అనే ఒక చిన్నారి పాప ఉంది. ఆ పాప ఒకటవ తరగతి చదువుతుంది. రోజూ పాఠశాల కు వెళుతూ వాళ్ల టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ , బాగా చదువు కుంటుంది. తరగతి గదిలో టీచరు ఒకటవ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ పాఠం THIRSTY CROW చెప్పారు. పాఠ పూర్తయ్యాక టీచరు పిల్లలతో చూశారా పిల్లలు .. మనకి దాహం వేస్తే ఇంటిలో ఉన్న బిందెలో , ఫ్రిజ్లో కుండల్లో నీళ్లు తాగుతాం కదా ! మరి పక్షులు జంతువులకు దాహం వేస్తే అవి ఎలా నీళ్ళు తాగుతాయి ? వాటికి ఇళ్ళు ఉండవు కదా! వాటి, దాహం తీరడానికి , ఆహారం సంపాదించడానికి ఎంతో శ్రమించాలి కదా ! పాపం వాటికి ఆహారం నీరు ఎవరిస్తారు? అని అడిగారు.
పిల్లలూ ! మరి పక్షులు జంతువులు ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయో మీకు తెలుసా ? వాటికి బాగా దాహం వేస్తే ఏమి చేస్తాయి? మీరేమైనా వాటికి సహాయం చేయగలరా? ఆలోచించి రేపు చెప్పండి. అని ఆ టీచర్ పాఠం ముగించారు.
ఆ రోజు సాయంత్రం స్వాతి స్కూల్ నుండి ఆడుకుంటూ ఇంటికి వెళ్ళింది. వాళ్ల ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు , మామిడి చెట్లు ఉన్నాయి. వాటిపై రకరకాల పక్షులు వచ్చి వాలుతూ ఉంటాయి . స్వాతి వాళ్ళ అమ్మ కోళ్లను పెంచుతుంది . వాటికి వాళ్ళ అమ్మ గిన్నెల్లో నీరు పోసి ఉంచడం చూసింది . కోళ్లు అయితే మన చుట్టూ తిరుగుతాయి . వాటికి నీరు , ఆహారం పెట్టొచ్చు . కానీ చెట్లపై ఉండే పక్షులకు, ఎలా నీరు , గింజలు పెట్టడం అని ఆలోచించింది. తను ఆడుకునే చిన్న చిన్న డబ్బాలతో చెట్లపై నీరు , గింజలు పడితే బాగుంటుంది . అనుకుంది.
మర్నాడు టీచర్ తో స్వాతి "టీచర్ టీచర్ నేను చిన్న చిన్న డబ్బాలు తెచ్చాను . వాటిలో నీరు పోసి గింజలు వేసి చెట్లకు వేలాడదీద్దాము . దాహం వేస్తే పక్షులు నీరు తాగుతాయి కదా" అంది .
టీచరు స్వాతి ని మెచ్చుకొని తన ఆలోచనను పిల్లలందరికీ చెప్పారు.మరియు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లకు చిన్న చిన్న డబ్బాలలో నీరు , గింజలు ఉంచి వేలాడదీసారు. అక్కడికి ఉడుతలు ,పక్షులు వచ్చి నీరు త్రాగుతుంటే పిల్లలంతా చాలా సంతోషించారు.
ప్రతి విద్యార్థి కూడా వీలైనంత వరకూ వారి బడిలో ఉన్న చెట్లకు ఇంటి చుట్టూ ఉన్న చెట్లకు ఇలా నీరు పెట్టమని టీచర్ చెప్పారు . ప్రతి ఒక్కరికి జంతువులు , పక్షుల ఉన్పట్ల భూత దయ ఉండాలని టీచర్ చెప్పారు . పిల్లలందరూ స్వాతిని చప్పట్లు కొట్టి అభినందించారు .
శ్రీమతి అనుపోజు సరస్వతి
టీచర్
M.P.P. స్కూల్
బంటువానివలస
గరుగుబిల్లి మండలం

1 Comments